నల్గొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త,మే 17
భవిష్యత్తుకు బలమైన పునాది విద్యేనని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “విద్యా విజయోత్సవం” కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించి, ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచిన 13 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 వేల నగదు బహుమతులను అందజేశారు. అలాగే కేజీబీవీ, మోడల్ స్కూల్లకు చెందిన 5 మంది విద్యార్థులు, స్పోర్ట్స్ స్కూల్కు చెందిన 4 మంది, జూనియర్ కళాశాలల నుంచి 3 మంది విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు ప్రదానం చేశారు.
లక్ష్యంతో చదివితేనే విజయం
విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇష్టపడి, కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పదవ తరగతితో చదువును ఆపకుండా ప్రతి విద్యార్థి ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివితేనే నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన అవకాశాలు లభిస్తాయని అన్నారు. గ్రాడ్యుయేషన్ విద్య జీవితంలో గొప్ప మార్పుకు దారితీస్తుందని తెలిపారు.
విద్యార్థులకు సరైన మార్గదర్శనం అవసరం
పై చదువులకు వెళ్లే విద్యార్థులకు సరైన దిశానిర్దేశం అవసరమని పేర్కొన్న కలెక్టర్, ఉపాధ్యాయులు, ఎంఈఓలు విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. పదవ తరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరేలా ప్రోత్సహించాలని కోరారు.
దివ్యాంగులకు కిట్ల పంపిణీ
అనంతరం మానసిక దివ్యాంగులకు అవసరమైన కిట్లను జిల్లా కలెక్టర్ అందజేసి సామాజిక బాధ్యతను చాటిచెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దస్రు నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
