హుజూర్నగర్, మే 19 ,శుభోదయం డైనమిక్
హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మేళ్లచెరువు మండలం వెల్లటూరు కాలనీకి చెందిన గీత కార్మికుడు దాసు సైదులు (46) విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
తాటిచెట్టు ఎక్కిన సమయంలో ప్రమాదం
కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసు సైదులు ఈ నెల 12వ తేదీన చింతలపాలెం మండల కేంద్రంలోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీసే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో కాలుజారి చెట్టు పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్కు గురయ్యాడు. అనంతరం చెట్టు పై నుంచి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.
ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
స్థానికులు వెంటనే అతడిని హుజూర్నగర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వారం రోజులుగా చికిత్స పొందుతున్న సైదులు మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి
మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణకు ఆధారమైన సైదులు మృతి చెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ స్పందించి తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు
మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
