సూర్యాపేట బ్యూరో, మే 17 శుభోదయ డైనమిక్ వార్త
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి విద్యా విజయోత్సవం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం
పదో తరగతి, ఇంటర్మీడియట్ మరియు క్రీడా విభాగాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ.10 వేల నగదు పురస్కారాలను అందజేశారు.
ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవాలి : కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి భవిష్యత్తులో వచ్చే ఆధునిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో పాటు ఏకాగ్రతతో పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
జిల్లాలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై పాఠశాల విద్యాశాఖను కలెక్టర్ అభినందించారు. ఇదే ఉత్సాహంతో వచ్చే విద్యా సంవత్సరంలో “బడిబాట” కార్యక్రమం ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 10 శాతం కొత్త అడ్మిషన్లు పెంచేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కే. అశోక్, డీఐఈఓ సులోచనరాణి, సెక్టోరియల్ అధికారులు హరికృష్ణ, సూర్యనారాయణ, పూలన్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వనమాల వెంకటేశ్వర్లు, వివిధ మండలాల ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
