Friday, September 11, 2026
Homeతాజా సమాచారంతెలంగాణ యాస, భాషను కాపాడింది కాళోజి— ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.నీరజ

తెలంగాణ యాస, భాషను కాపాడింది కాళోజి— ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.నీరజ

నేరేడుచర్ల, సెప్టెంబర్ 9, శుభోదయ డైనమిక్ వార్త

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా తన కలం ద్వారా ఎన్నో రచనలు చేసి తెలంగాణ భాష, యాసను కాపాడిన మహనీయుడు కాళోజి నారాయణరావు అని నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి.నీరజ కొనియాడారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని బుధవారం కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

కాళోజి చిత్రపటానికి నివాళులు

ఈ సందర్భంగా కాళోజి నారాయణరావు చిత్రపటానికి అధ్యాపకులు, సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ నీరజ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల భాష, యాస, సంస్కృతి, సామాజిక చైతన్యాన్ని తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన కాళోజి సేవలు చిరస్మరణీయమని అన్నారు.

నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం

కాళోజి ఆంధ్ర మహాసభ, గ్రంథాలయ ఉద్యమం, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌తో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారని ఆమె గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాళోజిని నిరాదరణకు గురిచేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఆయన జయంతిని అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం గర్వకారణమన్నారు.

తెలంగాణ ప్రజల గుండెల్లో కాళోజి

సీనియర్ అధ్యాపకులు పి.వెంకటరమణ, డాక్టర్ మద్దిమడుగు సైదులు మాట్లాడుతూ కర్ణాటకలో జన్మించిన కాళోజి నారాయణరావు రెండేళ్ల వయసులోనే కుటుంబంతో తెలంగాణకు వచ్చి వరంగల్‌లో స్థిరపడ్డారని తెలిపారు. ఆయన శాసనమండలి సభ్యునిగా పనిచేశారని, పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాళోజి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు.

పాల్గొన్న అధ్యాపకులు, సిబ్బంది

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రణతి, కేల్‌ఎన్ రావు, వెంకన్న, శ్రీనివాసులు, సునీత, ప్రసాద్, అంజయ్య, నరసింహాచారి, గణేష్, వీరు, వెన్నెల, అపర్ణ, వీరేష్‌తో పాటు సిబ్బంది అన్వేష్, వెంకన్న, దుర్గయ్య, ఖాన్, బేగం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments