కోదాడ, శుభోదయం డైనమిక్ వార్త, సెప్టెంబర్ 7
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను నిరసిస్తూ కోదాడ పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు మెరుపు రాస్తారోకో నిర్వహించారు. కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అసెంబ్లీని ‘కౌరవ సభ’గా మార్చారు
ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ‘కౌరవ సభ’గా మార్చిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను సభకు రాకుండా పోలీసు బలగాలతో అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
కేటీఆర్, హరీశ్రావుపై పోలీసుల వైఖరిని ఖండన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సీనియర్ నేత తన్నీరు హరీశ్రావు పట్ల పోలీసులు ప్రదర్శించిన దురుసు ప్రవర్తన, దాష్టీకాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు దుర్మార్గం
మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా కనీస నైతిక విలువలను పాటించకుండా పోలీసులతో భౌతిక దాడులు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కితే ఊరుకోం
తుపాకులు, లాఠీలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్ అగ్రనేతలు, మహిళా ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడిన పోలీసులపై తక్షణమే శాఖాపరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదికగా జరిగిన ఘటనపై ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.ఈ రాస్తారోకోతో కోదాడ ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తమ నిరసనను కొనసాగించారు.

