హుజూర్నగర్, జూలై 6 (శుభోదయ డైనమిక్ న్యూస్):
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ, కేటాయించనున్న పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, వాటిని కనీసం 20 వేలకు పెంచాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జనిగ సందీప్ డిమాండ్ చేశారు. సోమవారం హుజూర్నగర్ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.
నిరుద్యోగుల ఆశలకు గండి
ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రధాన ఆకాంక్షల్లో నియామకాలు ఒకటని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.
20 వేల పోస్టులతోనే న్యాయం
రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో కేవలం 5 వేల నుంచి 7 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేస్తే యువతకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. టీజీఎల్పీఆర్బీ ద్వారా కనీసం 20 వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కొండ సాయిచరణ్, నరసింహ వినయ్, వెంకటేశ్వర్లు, వెంకన్న, మహేష్, పవన్, ప్రవీణ్, నవీన్, గోపి, నరేష్, సురేష్, రమేష్, మహేష్, సత్యనారాయణ, స్వామి తదితరులు పాల్గొన్నారు.
