Tuesday, July 28, 2026
Homeతాజా సమాచారంఅమ్మ పేరుతో మొక్క నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి 'ఏక్ పెడ్ మా కే నామ్ –...

అమ్మ పేరుతో మొక్క నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి ‘ఏక్ పెడ్ మా కే నామ్ – సోయింగ్ టు గ్రోయింగ్ 2026’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

సూర్యాపేట బ్యూరో , జూలై 6,శుభోదయ డైనమిక్ వార్త

పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణ, విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్‌జీసీ), జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ఏక్ పెడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో మొక్కను నాటడం) – సోయింగ్ టు గ్రోయింగ్ 2026” జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఆవిష్కరించారు.

ప్రతి విద్యార్థి ఒక మొక్కను సంరక్షించాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యతాభావం పెరుగుతుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో కనీసం 10 పండ్ల మొక్కలతో పాటు ఇతర మొక్కలను కూడా నాటి వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం

ఎన్‌జీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ పౌరులు మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ తయారీ, పర్యావరణ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని వాటికి సంబంధించిన ఫోటోలను అప్‌లోడ్ చేయడం ద్వారా పాల్గొనవచ్చని వివరించారు.

‘హరిత సూర్యాపేట’ నిర్మాణానికి సహకరించాలి

జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కల నాటడం చేపట్టి “హరిత సూర్యాపేట” నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.

అన్ని విద్యాసంస్థలు భాగస్వాములు కావాలి

జిల్లా విద్యాశాఖాధికారి అశోక్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను విద్యార్థుల దైనందిన జీవితంలో భాగంగా మార్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

అధికారుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్ఓ ప్రేమ్‌రాజ్, జెడ్పీ సీఈఓ శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీఎఫ్‌ఓ దామోదర్ రెడ్డి, ఎన్‌జీసీ జిల్లా కోఆర్డినేటర్ లామ్ దేవరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments