మెదక్ జిల్లా, నవంబర్ 7, డైనమిక్
రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రజల ప్రాణ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు రైతులకు సూచించారు. కొంతమంది రైతులు సౌలభ్యం కోసం రహదారులపైనే ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఇరుకుగా మారిన రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
రాత్రివేళల్లో మరింత ప్రమాదం
రాత్రి సమయంలో రైతులు ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ పాలిథిన్ కవర్లతో కప్పడం వలన వాహనదారులు అవి గమనించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సురక్షిత ప్రదేశాల్లోనే ధాన్యం ఆరబెట్టాలి
ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ రైతులు గ్రామ పంచాయతీ ప్రాంగణాలు, ఖాళీ ప్రదేశాలు లేదా రహదారులకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశాలను ధాన్యం ఆరబెట్టడానికి వినియోగించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతలో ప్రతి ఒక్కరి పాత్ర
“ప్రజల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది” అని ఎస్పీ తెలిపారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి రహదారులపై ధాన్యం అరబెట్టడాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.
