సామూహికంగా వందేమాతర గీతాలాపన
డైనమిక్,సూర్యాపేటబ్యూరో, నవంబర్ 7
వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు భవ్యంగా వందేమాతర ఉత్సవం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పౌరులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ఐక్యతకు ప్రతీక వందేమాతరం – ఎస్పీ నరసింహా
60 ఫీట్లు రోడ్డునుంచి వాణిజ్య భవన్ సెంటర్వరకు వందేమాతర నినాదాలు, “భారత్ మాతాకీ జై” నినాదాలతో భారీ ర్యాలీ సాగింది. అనంతరం వాణిజ్య భవన్ సెంటర్ వద్ద జాతీయ పతాకావిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహా మాట్లాడుతూ “వందేమాతర గీతం భారత స్వాతంత్రోద్యమానికి ప్రేరణగా నిలిచింది. ఈ గీతం ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి స్వాతంత్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించింది. కులమతాలకు అతీతంగా దేశప్రేమను మేల్కొలిపిన ఈ గీతం భారత ఐక్యతకు ప్రతీక,” అని పేర్కొన్నారు.నేటి పిల్లలే రేపటి పౌరులని, వారు దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టే బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.
భారీ ర్యాలీ, దేశభక్తి నినాదాలతో మారుమోగిన సూర్యాపేట
ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పట్టణ ప్రముఖులు, వందేమాతర గీతాలాపన కమిటీ సభ్యులు పాల్గొని దేశభక్తి నినాదాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. వందేమాతర గీతం ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.
ప్రముఖులు పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డిఎస్పీ ప్రసన్నకుమార్, నరసింహ చారి, సిఐ వెంకటయ్య, ఎస్బి ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.అలాగే వందేమాతర గీతాలాపన కమిటీ సభ్యులు నాగవెల్లి ప్రభాకర్, పర్వతం శ్రీధర్ కుమార్, తోట శ్యామ్ ప్రసాద్, ప్రసన్న, దశరథ, సృజన కుమార్, ఉపేందర్, వెంకట్ రెడ్డి, హైమవతి, శ్రీదేవి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై దేశభక్తిని ప్రదర్శించారు.
