డైనమిక్ ,నేరేడు చర్ల,నవంబర్7
నేరేడు చర్ల మండల తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం అధికారుల కన్నా ప్రవైట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తోందన్న విమర్శలు ప్రజల్లో ముదురుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయం ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల అజెండాకి వేదికగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రవైట్ సిబ్బంది ఆధిపత్యం – అధికారుల నిర్లక్ష్యం!
తహసిల్దార్ ఆఫీస్కు వచ్చిన ప్రజలు మొదటగా “ప్రవైట్ వ్యక్తి”ని కలవకపోతే ఫైల్ కదలదన్న వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు కేవలం సంతకం పెట్టేంత పని మాత్రమే చేస్తున్నారని ప్రజల వాంగ్మూలం. ఫైళ్లు తయారు చేయడం నుంచి ప్రింటింగ్ వరకూ అంతా ప్రైవేట్ సిబ్బందే నిర్వహిస్తున్నారు.
గతంలో కూడా డి.ఆర్. బుక్ మిస్ అయినా చలనం లేదు
గతంలో కూడా నేరేడు చర్ల రెవెన్యూ కార్యాలయంలో డి.ఆర్. బుక్ మిస్ అయిన ఘటన చోటు చేసుకున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వ పత్రాలు అదృశ్యమైనా, ఫిర్యాదు చేయకపోవడం, విచారణ జరపకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఆరుగురు ప్రవైట్ వ్యక్తులు అధికారుల కుర్చీల్లో!
ప్రస్తుతం నేరేడు చర్ల తహసిల్దార్ కార్యాలయంలో మొత్తం ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు సక్రమంగా అధికారుల స్థానంలో కూర్చుని పనిచేస్తున్నారని సమాచారం. ప్రజలు చిన్న పని కోసం వచ్చినా, వారి చేతుల మీదుగా మాత్రమే ఫైళ్లు కదులుతున్నాయి. వీరే ఫైల్ సిద్ధం చేసి, ప్రింట్ చేసి, చివర్లో తహసిల్దార్ సంతకం కోసం తీసుకెళ్తున్నారు.
ప్రజల పని అంటే డబ్బు – లేని పక్షంలో ఆలస్యం!
బర్త్, డెత్ సర్టిఫికెట్,క్యాస్ట్, ఇన్కమ్, ఓబీసీ సర్టిఫికెట్లు వంటి సాధారణ పత్రాల కోసం ప్రజలు అనవసరంగా రోజులు తిరగాల్సి వస్తోంది. “ఫీజు” పేరుతో లంచాలు వసూలు అవుతున్నాయని, చెల్లించకపోతే ఫైళ్లు కదలవని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం ప్రజల్లో ఆందోళన
అధికారుల కుర్చీల్లో ప్రైవేట్ వ్యక్తులు కూర్చోవడం, పత్రాలు మిస్ కావడం, ప్రజల నుండి వసూళ్లు జరగడం వంటి అంశాలు నేరేడు చర్ల రెవెన్యూ కార్యాలయ విశ్వసనీయతను దెబ్బతీశాయి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లేమి కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ప్రజల ఆగ్రహం – ఉన్నతాధికారుల జోక్యం అవసరం!
ప్రజల నోళ్లలో ఒకే మాట —
“ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకుంటూ ప్రైవేట్ వారితో పనులు చేయించడం అంటే ప్రజాసేవ పైనే దాడి కాదా?” నేరేడు చర్ల మండలంలో ఈ ప్రవైట్ పాలన కొనసాగుతుండగా, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాది అధికారులు తక్షణం జోక్యం చేసుకుని ఈ అక్రమ వ్యవస్థను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తహసిల్దార్ సైదులు వివరణ
ఫైరవీలు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు.ప్రవైట్ వ్యక్తులు రాకుండా చర్యలు తీసుంటాం అని అన్నారు
