డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో ,జనవరి 31
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆన్లైన్ యూరియా బుకింగ్ విధానం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని అనేక మండలాల్లో ఫర్టిలైజర్ దుకాణాల ఆన్లైన్ వ్యవస్థలో యూరియా స్టాక్ ‘నిల్’గా కనిపిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.జిల్లా వ్యాప్తంగా వందలాది ఫర్టిలైజర్ షాపులు ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం షాపుల్లో ఆన్లైన్లో ఒక్క బస్తా కూడా స్టాక్ చూపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
కలెక్టర్ ప్రకటనలు – క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నం
జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాలు సమృద్ధిగా ఉన్నాయని ప్రకటనలు చేస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు యూరియా అందని పరిస్థితి నెలకొంది. అధికారుల మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోవడంతో రైతుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.
“80 శాతం రైతులు యూరియా తీసుకున్నారు” – అధికారుల వాదన
కొంతమంది మండల వ్యవసాయ అధికారులు ఇప్పటికే 80 శాతం మంది రైతులు యూరియా పొందారని చెబుతున్నారు. అయితే అదే సమయంలో ఆన్లైన్లో స్టాక్ ‘నిల్’గా కనిపించడం పలు ప్రశ్నలకు దారి తీస్తోంది. నిజంగా రైతులు యూరియా తీసుకుంటే స్టాక్ ఎక్కడి నుంచి వచ్చింది? అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు.
ఆన్లైన్ విధానంలోనూ దళారీ వ్యవస్థ?
ఆన్లైన్ బుకింగ్ విధానంలో కూడా మధ్యవర్తుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ముందుగానే బస్తాలను బుక్ చేసి, గుట్టుగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డీలర్లు – అధికారుల కుమ్మక్కా?
ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ శాఖ సిబ్బంది కుమ్మక్కై యూరియా బస్తాలను దాచిపెట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్టాక్ వివరాలను ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో అప్డేట్ చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని రైతులు ఆరోపిస్తున్నారు.
పంటలపై తీవ్ర ప్రభావం
సకాలంలో యూరియా అందకపోవడంతో పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ వివరణ
మిర్యాలగూడ నుండీ మన జిల్లాకు రావాల్సిన యూరియా శుక్రవారం లోడింగ్ కాలేదు. దాని వల్ల ఈ రోజు జిల్లాలో నీల్ చూపిస్తుంది. ఈ రోజు లోడిండ్ అవుతున్నాయి. రేపటి నుండి అందరికీ అన్ని మండలాల్లో యూరియా బస్తాలు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి అని తెలిపారు
