సూర్యాపేట బ్యూరో, మే 22, శుభోదయ డైనమిక్ వార్త
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని రవి మహాల్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి తమ శాఖల ప్రగతి అంశాలను ప్రదర్శించాయి.
అవగాహన కార్యక్రమాలతో ఆకట్టుకున్న పోలీస్ శాఖ
ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం, మహిళా భద్రత, పిల్లల రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ కలిసి పోలీస్ స్టాల్ను సందర్శించి ప్రదర్శనలను పరిశీలించారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల నివారణ, మహిళా భద్రత, రోడ్డు భద్రతకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై మరింత చైతన్యం అవసరం
ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో సమాజం భాగస్వామ్యం కావాలి
ప్రస్తుతం యువత, విద్యార్థులను గంజాయి వంటి మాదకద్రవ్యాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, సమాజం మొత్తం కలిసి వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన పెంపుతో పాటు కఠిన చర్యలు కూడా అవసరమన్నారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ప్రజలను అత్యాశలకు గురిచేసి ఆర్థికంగా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీ సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
మహిళలు, పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు
మహిళలు, పిల్లల భద్రత కోసం భరోసా సెంటర్, షీ టీమ్స్, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగాలు మరింత సమర్థంగా పనిచేయాలని అధికారులు సూచించారు.


