శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్నగర్,ఆగస్టు 30
మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో పాత కక్షలతో పాటు వేప చెట్టు సరిహద్దు విషయంలో శనివారం ఉదయం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. సుమారు ఉదయం 8 గంటల సమయంలో ఇరువర్గాలు గొడ్డళ్లతో పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం.
గొడ్డలి దాడిలో ఇద్దరు మృతి
ఈ ఘర్షణలో మంద వెంకటేశ్వర్లు యాదవ్ గొడ్డలి దాడికి గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తి సైదాకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం.
ఎస్సైపై దాడి.. తీవ్ర గాయాలు
ఘర్షణ విషయం తెలుసుకున్న మేళ్లచెరువు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎస్సై నవీన్కుమార్పై కూడా గొడ్డలితో దాడి జరగడంతో ఆయన తలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ఘటనపై సమాచారం అందుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మఠంపల్లి, చింతలపాలెం ఎస్సైలు సైతం అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
తండాలో పోలీసుల బందోబస్తు
ఇద్దరు మృతి చెందడం, ఎస్సైపై దాడి జరగడంతో ఎర్రగట్టు తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఘర్షణకు దారితీసిన కారణాలు మరియు బాధ్యులపై వివరాలు సేకరిస్తున్నారు.
