మోతె, ఆగస్టు 14 శుభోదయ డైనమిక్ వార్త
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తే పోలీసు శాఖ ప్రతిష్ఠకే మచ్చగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోతె మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ, రెవెన్యూ పరిధిలో NH-365 హైవే పక్కన హత్య చేసి, ఆనవాళ్లు కనిపించకుండా మృతదేహాలను మట్టిలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్పై ప్రధాన అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలు, అనుమానాలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటన వెనుక అసలు కారణాలు, ఇందులో ఎవరి పాత్ర ఉందనే విషయాలను పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి
హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కుల సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

