Friday, September 11, 2026
Homeతాజా సమాచారంరోడ్లపై పశువుల స్వైర విహారం.. వాహనదారుల ప్రాణాలతో చెలగాటం! యజమానుల నిర్లక్ష్యంపై చర్యలేవీ? ప్రమాదాలు జరిగితేనే...

రోడ్లపై పశువుల స్వైర విహారం.. వాహనదారుల ప్రాణాలతో చెలగాటం! యజమానుల నిర్లక్ష్యంపై చర్యలేవీ? ప్రమాదాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారా? మున్సిపల్ అధికారుల తీరుపై వాహనదారుల్లో తీవ్ర అసంతృప్తి

శుభోదయ డైనమిక్ వార్త – హుజూర్‌నగర్, ఆగస్టు 13

హుజూర్‌నగర్ పట్టణంలో పశువుల యజమానులు తమ పశువులను యథేచ్ఛగా రోడ్లపై వదిలేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపైనే పశువులు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాత్రివేళల్లో మరింత ప్రమాదకరం

పగటిపూట వాహనాల రద్దీ ఉండే ప్రధాన రహదారులపై పశువులు అడ్డంగా తిరుగుతుండటంతో వాహనదారులు వాటిని తప్పించుకుంటూ ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో రోడ్లపైనే పశువులు సేదతీరుతుండటంతో ద్విచక్రవాహనదారులకు ప్రమాదం మరింత పొంచి ఉంది.

ప్రమాదం జరిగే వరకు అధికారులకు కనిపించవా?

పశువులను రోడ్లపై వదిలే యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పశువులను అదుపులో పెట్టాలని పలుమార్లు ప్రజలు కోరుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పశువులకు ఏదైనా జరిగితే యజమానుల ఆందోళన.. మరి ప్రజల భద్రత సంగతేంటి?

రోడ్డుపై వదిలిన పశువులకు ప్రమాదవశాత్తు వాహనం ఢీకొంటే వెంటనే తమ పశువుకు నష్టపరిహారం చెల్లించాలంటూ యజమానులు ఆందోళనకు దిగుతున్న సందర్భాలు ఉన్నాయని వాహనదారులు చెబుతున్నారు. అయితే అదే పశువులను ప్రతిరోజూ రోడ్లపై వదిలి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్

రోడ్లపై పశువులను వదిలే యజమానులను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, పశువులను రహదారులపైకి రాకుండా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments