నాగార్జునసాగర్,శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 10
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ విజయ విహార్లోని కృష్ణా నది తీరాన వరుణ యాగం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు ప్రారంభించారు.
గోపూజ, విశ్వక్సేన పూజతో యాగశాల ప్రవేశం
యాగ ప్రారంభానికి ముందు ఋత్వికులు శాస్త్రోక్తంగా గోపూజ, విశ్వక్సేన పూజ నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలతో వరుణ యాగానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ భవానీ శంకర్, డిప్యూటీ ఈఓతో పాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యాగం సందర్భంగా విజయ విహార్ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




