శుభోదయ డైనమిక్ వార్త, మునగాల ,జూలై 17
సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వ్యవసాయ భూమిలోని వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతుడు చిట్యాల లింగయ్య (45), తండ్రి రాములు, భక్తలపురం గ్రామానికి చెందినవాడు. ఆయన భార్య ఉపేంద్ర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగయ్య చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఆసుపత్రికి వెళ్లి, అనంతరం మునగాలలోని తన అత్తగారి ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి రాత్రి తన బంధువుల గ్రామమైన తాడ్వాయికి వెళ్లాడు.
వ్యవసాయ భూమిలో ఉరివేసుకుని మృతి
తాడ్వాయి గ్రామ సమీపంలోని వ్యవసాయ భూమిలో ఉన్న వేపచెట్టుకు ఉరివేసుకుని లింగయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య, ఇద్దరు కుమార్తెల రోదనలు స్థానికులను కలచివేశాయి.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న మునగాల ఎస్సై సంజీవరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
