సూర్యాపేట బ్యూరో , జూలై 3,శుభోదయ డైనమిక్ వార్త
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి పోలీసులు భారీ స్థాయిలో అర్ధరాత్రి నాఖాబందీ నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, పట్టణంలోకి వచ్చిపోయే అన్ని మార్గాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
100 మందికి పైగా పోలీసులతో విస్తృత తనిఖీలు
జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య పర్యవేక్షణలో ఈ నాఖాబందీ చేపట్టారు. ఈ తనిఖీల్లో 100 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వాహనాల పత్రాల పరిశీలన – 70కి పైగా వాహనాలు సీజ్
తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు తదితర వాహనాలను నిలిపి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు, అలాగే అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన 70కి పైగా ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 4 ఇతర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
నేరాల నియంత్రణే లక్ష్యం: డీఎస్పీ ప్రసన్నకుమార్
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, అనుమానితుల కదలికలపై నిఘా, చోరీ వాహనాల గుర్తింపు, అక్రమ రవాణాను అరికట్టడమే నాఖాబందీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని డీఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని, సురక్షిత సమాజ నిర్మాణంలో పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.




పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, నాగారం సీఐ నాగేశ్వరరావు, తుంగతుర్తి సీఐ ఉపేందర్రావు, డివిజన్ ఎస్ఐలు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
