శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్నగర్, మే 11
హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామంలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ శివారులోని పెద్ద గట్టు సమీపంలో ఉన్న పురాతన వీరన్న స్వామి రాతి విగ్రహాన్ని పక్కకు జరిపి సుమారు ఐదు అడుగుల లోతులో గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించాయి.
రాత్రికి రాత్రే తవ్వకాలు
స్థానికుల వివరాల ప్రకారం, దుండగులు రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పురాతన విగ్రహాలు, ఆలయాల సమీపంలో గుప్త నిధులు ఉంటాయనే మూఢనమ్మకంతో ఈ చర్యలకు పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో గ్రామ ప్రజలు
పురాతన విగ్రహాన్ని ధ్వంసం చేసేలా పక్కకు తొలగించడం పట్ల గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను రక్షించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
పురావస్తు శాఖ స్పందించాలని డిమాండ్
లింగగిరి గ్రామంలోని వీరన్న స్వామి ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉన్న అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆలయ చరిత్రను వెలుగులోకి తీసుకురావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
