హుజూర్నగర్, శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 30
మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో పాత కక్షలతో పాటు వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య శనివారం ఉదయం జరిగిన ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం.
గొడ్డలి దాడిలో ఇద్దరు మృతి
ఘర్షణలో గొడ్డలితో జరిగిన దాడిలో మంద వెంకటేశ్వర్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తి సైదాకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం.
ఎస్సై నవీన్కుమార్కు గాయాలు
ఘర్షణను అదుపు చేసేందుకు ప్రయత్నించిన మేళ్లచెరువు ఎస్సై నవీన్కుమార్కు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మఠంపల్లి, చింతలపాలెం ఎస్సైలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
