నల్గొండ బ్యూరో , ఆగస్టు 13,శుభోదయ డైనమిక్ వార్త
మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి నల్గొండ ఫాస్ట్ట్రాక్ కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో పాటు రూ.7 వేల జరిమానా చెల్లించాలని, బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని కోర్టు ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు.
మిర్యాలగూడలో 2020లో ఘటన
2020లో మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై క్రైమ్ నంబర్ 97/2020, SC No.198/2020గా కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ జాఖీర్ బాబా (20)ను నిందితుడిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి ఆధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని IPC సెక్షన్ 366, POCSO చట్టంలోని సెక్షన్ 3, 4 కింద దోషిగా నిర్ధారించింది.
ఏకకాలంలో శిక్షల అమలు
IPC సెక్షన్ 366 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా, జరిమానా చెల్లించకపోతే అదనంగా 3 నెలల సాధారణ కారాగార శిక్ష విధించారు. POCSO చట్టం సెక్షన్ 3, 4 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా, జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. POCSO చట్టంలోని సెక్షన్ 42 ప్రకారం అధికమైన శిక్ష అమలు చేయాల్సి ఉండటంతో అత్యాచారం నేరానికి POCSO చట్టం కింద విధించిన శిక్షను అమలు చేయాలని కోర్టు నిర్ణయించింది. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు కానున్నందున మొత్తం 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అమలు కానుంది. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందజేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
దర్యాప్తు, ప్రాసిక్యూషన్ బృందానికి ఎస్పీ అభినందనలు
కేసులో సమర్థవంతమైన దర్యాప్తు నిర్వహించిన అప్పటి మిర్యాలగూడ-II టౌన్ ఎస్హెచ్ఓ డి. శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్తో పాటు, కేసును న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్, జె. సోమ నర్సయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కోర్టు డ్యూటీలో సమన్వయంతో పనిచేసిన డీసీఆర్బీ సీఐ శ్రీను నాయక్, సీడీఓ బుర్రి అఖిల్, డి. రాగ్యా నాయక్, లైజన్ అధికారులు పి. నరేందర్, ఎన్. మల్లికార్జున్లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. మహిళలు, బాలికలపై నేరాలకు పాల్పడే వ్యక్తులపై జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు, ప్రాసిక్యూషన్ ప్రక్రియలను సమర్థవంతంగా కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.
