Tuesday, July 28, 2026
Homeతాజా సమాచారంమహిళల భద్రతకు 'పోలీస్ అక్క' భరోసా బాలికలు, మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీస్ అక్కతో...

మహిళల భద్రతకు ‘పోలీస్ అక్క’ భరోసా బాలికలు, మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీస్ అక్కతో పంచుకోవాలి: అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి

సూర్యాపేట బ్యూరో , జూలై 15 శుభోదయ డైనమిక్ వార్త

మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలను నిర్భయంగా పోలీస్ అక్కకు తెలియజేయవచ్చని, వారికి చట్టపరమైన సహాయం అందించి అండగా నిలవడమే రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు.

తెలంగాణ గురుకుల బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమం

పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట రూరల్ పోలీసులు, జిల్లా షీ టీం ఆధ్వర్యంలో మండల పరిధిలోని బాలెంల గ్రామ సమీపంలోని తెలంగాణ గురుకుల బాలికల విద్యాలయంలో ‘పోలీస్ అక్క’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక పోలీస్ అక్క

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళా పోలీస్ అధికారిని ‘పోలీస్ అక్క’గా నియమించామని తెలిపారు. మహిళలు, బాలికలు తమ సమస్యలను కుటుంబ సభ్యురాలికి చెప్పినట్లే పోలీస్ అక్కకు వివరించవచ్చని, సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయం అందించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారని వివరించారు.

ఆపదలో ఉన్న వారికి అండగా పోలీస్ అక్క

వేధింపులకు గురవుతున్న మహిళలు, బాలికలకు తక్షణ సహాయం అందించి, వారికి భద్రత కల్పించడం, న్యాయం జరిగేలా చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసుల సహాయం పొందాలని సూచించారు.

షీ టీమ్స్‌కు తోడుగా పోలీస్ అక్క సేవలు

డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మహిళల రక్షణలో ఇప్పటివరకు షీ టీమ్స్, భరోసా సిబ్బంది సేవలందిస్తుండగా, ఇకపై పోలీస్ అక్క సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. మహిళలు, బాలికలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పాటలు, నృత్యాలతో చైతన్యం

పోలీస్ కళాబృందం పాటలు, నృత్యాల ద్వారా పోలీస్ అక్క కార్యక్రమంపై విద్యార్థినులకు అవగాహన కల్పించింది. మహిళల భద్రత, చట్టాలపై సందేశాత్మక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ ఎస్‌ఐ అనిల్ రెడ్డి, షీ టీం ఎస్‌ఐ నీలిమ, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments