శుభోదయ డైనమిక్ వార్త,పెద్ద శంకరంపేట, జులై 24
మెదక్ జిల్లా పరిధిలోని పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని పలు వీధుల్లో నెలలుగా స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాత్రి వేళల్లో గ్రామ వీధులు అంధకారంలో మునిగిపోతున్నాయని వాపోతున్నారు.
వర్షాకాలంలో మరింత ఇబ్బందులు
వర్షాల కారణంగా వీధుల్లో బురద పేరుకుపోవడంతో రాత్రి సమయంలో ప్రజలు నడవడం ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈవో, సర్పంచ్ వెంటనే చర్యలు తీసుకోవాలి
గ్రామంలోని ప్రతి వీధిని సర్పంచ్, ఈవో స్వయంగా పరిశీలించి వెలగని స్ట్రీట్ లైట్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి విద్యుత్ స్తంభానికి పనిచేసే వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని అంధకారం నుంచి బయటపడేయాలని కోరుతున్నారు. సమస్యపై అధికారులు ఇకనైనా స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.
