డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 7
1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయానికి నేడు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశభక్తి ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
ఎస్పీ ఆధ్వర్యంలో గేయాలాపన
జిల్లా పోలీస్ అధికారి శరత్ చంద్ర పవార్, ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంలో ఎస్పీ మాట్లాడుతూ — “దేశభక్తిని, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం ప్రతి భారతీయుడిలో ఆత్మగౌరవాన్ని నింపుతుంది. మనమంతా దేశ సేవలో భాగమవ్వాలన్న స్పూర్తి ఇందులో ఉంది” అని పేర్కొన్నారు.
దేశభక్తి జ్యోతి నిలుపుదాం:ఎస్పీ శరత్ చంద్ర పవార్
పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజల రక్షణతో పాటు దేశ గౌరవాన్ని కాపాడే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఎస్పీ, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
దేశభక్తి గీతంతో గర్జించిన పోలీస్ కార్యాలయం
పోలీస్ సిబ్బంది సమిష్టిగా వందేమాతరం గేయాన్ని ఆలపించడంతో కార్యాలయం దేశభక్తి ఉత్సాహంతో మారుమోగింది. కార్యక్రమం చివరగా జాతీయ జెండాకు వందనాలు అర్పించారు.



