డైనమిక్,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 25
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా, వారి త్యాగాలను స్మరించేందుకు సూర్యాపేట జిల్లా పోలీస్ కళాబృందం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ కే. నరసింహ ఆదేశాల మేరకు శనివారం సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్ మరియు కొత్త బస్టాండ్ వద్ద నిర్వహించబడ్డాయి. కళాబృందం సభ్యులు సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా పోలీసు అమరవీరుల సేవలను, దేశం కోసం అర్పించిన వారి త్యాగాలను ప్రజలకు వివరించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

