డైనమిక్ ,సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 29
మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణమే స్పందించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
అధికారులు హెడ్క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలి
జిల్లాలో వర్ష పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అధికారులు తమ తమ హెడ్క్వార్టర్స్లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ విభాగం అధికారి కూడా అనుమతి లేకుండా ప్రధాన కేంద్రం వదిలి వెళ్లరాదని ఆయన హెచ్చరించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు — 6281492368
వర్ష పరిస్థితులను పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 6281492368 కు సంప్రదించాలని సూచించారు.
పాఠశాలలకు స్థానిక సెలవు
భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈరోజు స్థానిక సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వర్షాల కారణంగా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శిధిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలి
భారీ వర్షాల కారణంగా శిధిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి, ఆ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
కృష్ణ, మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణా, మూసి నదుల పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.
ధాన్యం రక్షణ చర్యలు తీసుకోవాలి
వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలు కప్పి ఉంచాలని కలెక్టర్ తెలిపారు. రైతులు రెండు రోజుల పాటు వరి పంట కోత వాయిదా వేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహించి చెరువులు, కాల్వలు వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలని సూచించారు. రోడ్లపై, కల్వర్టులపై నీరు ప్రవహిస్తే వాహన రాకపోకలు నిలిపివేయాలని ఆయన ఆదేశించారు.
వీసీ కాన్ఫరెన్స్
అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
