సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 16
దళితుల హక్కుల పరిరక్షణకు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా లోనీ కోదాడ పట్టణంలో సోమవారం ఇటీవల పోలీసు లాక్అప్లో మరణించిన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.రాజేష్ తల్లి లలితమ్మను కలిసి మృతికి గల కారణాలను తెలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు.
సుమోటో కేసు నమోదు – చార్జ్షీట్ ఆలస్యంపై ప్రశ్నలు
తదుపరి కోదాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, కర్ల రాజేష్ కేసును పత్రికల ద్వారా గమనించి కమిషన్ సుమోటోగా నమోదు చేసిందన్నారు. కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు జరిగిందని పేర్కొన్నారు.ఇప్పటి వరకు చార్జ్షీట్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే చార్జ్షీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేసులో బాధ్యులైన సీఐపై చర్యలు తీసుకోవడమే కాకుండా ఎస్సైపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీ, జిల్లా ఎస్పీలకు సూచించారు.పది రోజుల్లో రీ-పోస్ట్మార్టం నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
కమిషన్ ఆదేశాలను లెక్కచేయకపోతే కఠిన చర్యలు
1989 ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం కమిషన్ ఆదేశాలను పాటించకపోతే సంబంధిత అధికారులపై నిర్లక్ష్య చర్యల కింద సస్పెన్షన్తో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా ఉండవచ్చని హెచ్చరించారు.
కుటుంబానికి ప్రభుత్వ సహాయం
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, అడిషనల్ డీజీ డి.ఎస్. చౌహన్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సమక్షంలో రాజేష్ తల్లి లలితమ్మకు ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ పత్రాన్ని అందజేశారు.మూడు రోజుల్లో ఒక ఉద్యోగం కల్పించడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఉన్న స్థలంలో ఇల్లు నిర్మాణానికి ఇల్లు మంజూరు చేయడం, మూడు ఎకరాల భూమి ఇవ్వడానికి కలెక్టర్ అంగీకరించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ డి.ఎస్. చౌహన్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఆర్డీవో సూర్యనారాయణ, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి దయా నందరాణి తదితరులు పాల్గొన్నారు.



