మాచర్ల, డైనమిక్ న్యూస్, జనవరి 6
సమగ్ర సంస్కరణల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని జమ్మలమడక గ్రామంలో నిర్వహించిన రాజముద్రతో కూడిన నూతన పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రైతులకు నూతన పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ
ఈ సందర్భంగా నూతనంగా ప్రింట్ చేసిన పట్టదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే స్వయంగా రైతులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వ పాలనలో రాజముద్ర పేరుతో రాజసం, దోపిడీ స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు.
రైతుల భూములపై ఫోటో రాజకీయాలు
పొలం గెట్ల సర్వే రాళ్లపై తన ఫోటో వేయించుకొని రైతుల భూములను తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారని జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పట్టదారు పాసుపుస్తకాలపై జగన్ ఫోటోలు, నవ రత్నాల ప్రచారంతో రైతు ప్రయోజనాలకు తూట్లు పొడిచారని అన్నారు.
భూములపై పూర్తి హక్కుల కల్పనకు చర్యలు
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా భూములపై ప్రజలకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల భద్రత, ఆస్తి హక్కుల పరిరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గోకుల షెడ్ల నిర్మాణంలో జమ్మలమడక ఆదర్శం
గోకుల షెడ్ల నిర్మాణాల్లో నియోజకవర్గ స్థాయిలో జమ్మలమడక గ్రామం ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే రైతులను అభినందించారు. రూ.11.50 లక్షల ప్రభుత్వ నిధులతో ఒకే రోజులో నిర్మించిన ఐదు గోకుల షెడ్లను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
పశుగ్రాసం సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం
కూటమి ప్రభుత్వం పశుగ్రాసం సాగుకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోందని, ఈ అవకాశాన్ని పాడి పరిశ్రమకు సంబంధించిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో ఫణికుమార్ నాయక్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
