డైనమిక్,గరిడేపల్లి, నవంబర్ 5
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) స్థాపనకు డిసెంబర్ 26 నాటికి నూరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఈ వేడుకలను గ్రామ గ్రామాన పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
ప్రతి పోరాటంలో సిపిఐ పాత్ర విశిష్టం
గరిడేపల్లి మండల కేంద్రంలో బుదవారం సిపిఐ సీనియర్ నాయకుడు త్రిపురం సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
భారత స్వాతంత్ర్య సమరానికి ముందు, తర్వాత జరిగిన ప్రతి ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు.దేశంలో దొరలు, దేశముఖులు, జమీందారుల దమనానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించి, లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన ఘనత సిపిఐదేనని గుర్తుచేశారు.
ప్రజల్లో భయరహితత, చైతన్యం నింపిన పార్టీ
“నీ బాంచెన్ అనే దాస్య సంస్కృతిని చెరిపి, ప్రజల్లో భయరహితతను, ప్రశ్నించే ధైర్యాన్ని నింపిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ” అని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ప్రజల్లో చైతన్యం కలిగించి, సామాజిక సమానత్వం కోసం సిపిఐ చేసిన పోరాటాలు ఈ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలుస్తాయని చెప్పారు.
ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించాలి
నూరేళ్ల చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేయాలంటే, గ్రామ గ్రామాన శతజయంతి వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి పార్టీ యూనిట్ ఈ వేడుకలను ప్రజా చైతన్య కార్యక్రమాలుగా మార్చాలని సూచించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, సహాయ కార్యదర్శి పోటు పూర్ణచంద్రరావు, రైతు సంఘం జిల్లా నాయకుడు బిల్లా కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, చేవా వెంకన్న, కుందూరు వెంకటరెడ్డి, అంబటి వెంకటరెడ్డి, తిరగమళ్ళ కిరణ్, వేశాల ఆంజనేయులు, ప్రతాని సైదులు, పంగ సైదులు, ఈదయ్య, షేక్ పీర్ సాహెబ్, గోధుమల ఈశ్వరాచారి, అంబటి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
