డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 21, టేక్మాల్
టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట ప్రధాన రహదారిపై శనివారం గడ్డి లారీకి మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. స్థానికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
విద్యుత్ తీగ తగిలి మంటలు
స్థానికుల సమాచారం మేరకు, మెదక్ జిల్లా కొల్చారం గ్రామానికి చెందిన (ఏడిటి) 9192 నంబరు గల లారీ హైదరాబాద్ జియగూడ ప్రాంతంలోని గోశాలకు పశువుల మేత తరలించేందుకు బయలుదేరింది. టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామ శివారులో సుమారు 350 గడ్డి మోపులు నింపుకుని ప్రధాన రోడ్డుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
స్థానికుల చాకచక్యం
మంటలు గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించి కర్రల సహాయంతో గడ్డిని లారీ నుంచి బయటకు తోసి అగ్ని వ్యాపించకుండా అడ్డుకున్నారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో గడ్డి మోపులు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు మేర చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.
ఆస్తి నష్టం – గాయపడిన ఇద్దరు
ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని లారీ డ్రైవర్ నాగరాజు తెలిపారు. నల్లకుంట తాండకు చెందిన సేవాలాల్ యూత్ సభ్యులు జేసీబీ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం పాపన్నపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.స్థానికుల సమయోచిత చర్యతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
