నల్గొండ, నవంబర్ 26 (డైనమిక్ న్యూస్):
గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు.
14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణ
బుధవారం ఉదయాదిత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణకు సంబంధించి నల్గొండ, చండూరు డివిజన్ల ఆర్వోలు (స్టేజ్–వన్), ఏఆర్వోలు, ఎంపీడీవోలు కోసం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి విడతలో 14 మండలాల్లోని 117 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని తెలిపారు.
ఎన్నికల విధుల పట్ల సీరియస్గా ఉండాలి
గ్రామపంచాయతీ ఎన్నికలను అన్ని స్థాయి అధికారులు అత్యంత సీరియస్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన అన్ని నియమ నిబంధనలను తూచ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు.
పోలీస్ బందోబస్తు – హెల్ప్డెస్క్ ఏర్పాటు
నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు, ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే తగినన్ని నామినేషన్ ఫారాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు
ఎంపీడీవోలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిర్ధిష్టంగా అమలు చేయాలని, ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు
ఈ శిక్షణ కార్యక్రమంలోస్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్,జెడ్పి సీఈఓ శ్రీనివాసరావు,డీపీఓ వెంకయ్య,నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి,చండూరు ఆర్డీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
