సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 30
సూర్యాపేట రూరల్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేదేరివారి గూడెం సమీపంలోని భీమారం లో–లెవల్ వంతెన వద్ద నీటి ప్రవాహ పరిస్థితిని జిల్లా పోలీసు అధికారి నరసింహ గురువారం స్వయంగా పరిశీలించారు.
వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులు, కుంటలు, నదులు నిండిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రజలు నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా, చెరువులు, కుంటలు, వాగులు, నదుల్లోకి దిగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పోలీసు శాఖ అప్రమత్తంగా భద్రతా చర్యలు చేపట్టింది
వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఎస్పీ చెప్పారు. ప్రమాదకర ప్రాంతాల్లో పహారా బృందాలను ఏర్పాటు చేయడం, నీటి ప్రవాహం ఉన్న రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం, వాహనాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం వంటి చర్యలు చేపట్టామని తెలిపారు.
ప్రజల రక్షణలో పోలీసులు నిత్యం కృషి
ప్రజల రక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అహర్నిశలు పని చేస్తున్నారని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. వర్షాల కారణంగా అవసరమైనచోట్ల చెట్లు తొలగించడం, నీటిలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీయడం, ప్రమాదంలో ఉన్న ప్రజలను రక్షించడం వంటి చర్యలు తీసుకున్నామని వివరించారు.
అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయండి
జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సేవలు పొందాలని ఎస్పీ సూచించారు. తుఫాను ప్రభావం కొనసాగుతున్నందున సెలవులు రద్దు చేసి అన్ని సిబ్బందిని విధుల్లో కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ పరిశీలన కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ప్రత్యేక శాఖ అధికారి రామారావు, ఉప ఇన్స్పెక్టర్ బాలునాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.



