డైనమిక్, నేరేడు చర్ల, అక్టోబర్ 31
సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి షేక్ జావేద్ శుక్రవారం నాడు నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పంటల నష్ట స్థాయిని అంచనా వేసి, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
పంట నష్టం తగ్గించేందుకు సూచనలు
అధికారులు రైతులకు తగు సూచనలు అందజేశారు. పాలు పోసుకునే దశలో చేలు పడిపోతే ముందుగా అంతర్గత కాలువల ద్వారా నీటిని తొలగించాలని, తరువాత పడిపోయిన చేలను పైకి లేపి కట్టుకోవాలని సూచించారు.
తెగుళ్ల నివారణ చర్యలు
నిలిచిన మరియు పడిపోయిన చేలలో గింజల రంగు మారడం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారించేందుకు ఎకరానికి 200 మిల్లీలీటర్ల ప్రోపికోనజోల్ మందును పిచికారీ చేయాలని సూచించారు.
ఉప్పు ద్రావణం ప్రయోజనం
గింజ గట్టి పడే దశలో ఉన్న పంటలు అధిక వర్షాలకు గురైతే వెంటనే నీటిని తొలగించి చేలను పైకి లేపి కట్టుకోవాలని సూచించారు. ఆ తరువాత ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల గింజ మొలకెత్తకుండా, రంగు మారకుండా నివారించవచ్చని వివరించారు.


రైతు మిత్రుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి అన్వేష్, అభ్యుదయ రైతులు, రైతు మిత్రులు పాల్గొని పంట నష్ట పరిస్థితులను పరిశీలించారు.
