నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,సెప్టెంబర్ 18
శుభోదయ డైనమిక్ వార్తలో ప్రచురితమైన కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరేడుచర్ల మండలం రాజీవ్నగర్ ఎంపీపీఎస్ పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు ధరావత్ వీర్యాను సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ సస్పెండ్ చేశారు.
బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 196 ఎంజీ
ఉపాధ్యాయుడు విధుల్లో ఉన్న సమయంలో నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 196 ఎంజీ/100 ఎంఎల్ ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై సెప్టెంబర్ 1న శుభోదయ డైనమిక్ వార్తలో కథనం ప్రచురితమైంది. అనంతరం సంబంధిత నివేదికలు, ఆధారాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్
సెప్టెంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనలు, 1991లోని నిబంధనల మేరకు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని డీఈఓ స్పష్టం చేశారు. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం జీవన భృతి పొందేందుకు ఉపాధ్యాయుడు అర్హుడని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విద్యాశాఖ చర్యలపై స్థానికుల హర్షం
పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెబుతోందని స్థానికులు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని వారు కోరుతున్నారు.
