డైనమిక్, నరసరావుపేట,అక్టోబర్27
ఎడ్లపాడు మండలం ఎన్.ఎస్.ఎల్ ఎదుట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు.వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు నుంచి అమరావతి వైపు చేపల దాణా బస్తాలతో వెళ్తున్న లారీ వేగం కారణంగా అదుపు తప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న ఎడ్లపాడు ఎస్సై టి. శివరామకృష్ణ, సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో రహదారిపై దాణా బస్తాలు చెల్లాచెదురుగా పడి ట్రాఫిక్ అంతరాయం కలిగించాయి. పోలీసులు తక్షణ చర్యలు తీసుకొని బస్తాలను ప్రక్కకు తరలించి వాహన రాకపోకలు సాధారణ స్థితికి తెచ్చారు.డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
