డైనమిక్,జడ్చెర్ల, అక్టోబర్ 17
గత మూడు దశాబ్దాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హతకు అడ్డుగా నిలిచిన “మూడు పిల్లల నిబంధన”ను ఎత్తివేయాలన్న చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్పై రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది.
శుక్రవారం జడ్చెర్ల నియోజకవర్గంలోని క్యాంప్ ఆఫీస్ వద్ద ఈ నిర్ణయానికి సంకేతంగా ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనురుధ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
తల్లిదండ్రులు మాట్లాడుతూ —
“గత 30 ఏళ్లుగా మాకు రాజకీయంగా పాల్గొనే అవకాశాన్ని ఈ నిబంధనే దూరం చేసింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాకు కొత్త జీవం ఇచ్చింది. స్థానిక పాలనలో భాగస్వామ్యం అవ్వడానికి మార్గం సుగమమైంది” అని పేర్కొన్నారు.ముగ్గురు పిల్లల నిబంధనతో వందలాది కుటుంబాలు అన్యాయానికి గురయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టితో ఆ అన్యాయం తొలగింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కు కల్పించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం” అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాంప్ ఆఫీస్ పరిసరాలు “రేవంత్ జిందాబాద్”, “ప్రజా ప్రభుత్వం జయహో” నినాదాలతో మార్మోగాయి.
