నల్లగొండ బ్యూరో , సెప్టెంబర్ 14,శుభోదయ డైనమిక్ వార్త
వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పరస్పర గౌరవంతో శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను సోదరభావంతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలి
ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం లేకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ నాగరాజు, ఆర్ఐలు సంతోష్, సూరప్ప నాయుడు, కళ్యాణ్ రాజ్, ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
