నేరేడుచర్ల, సెప్టెంబర్ 1, శుభోదయ డైనమిక్
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధరావత్ విరియాపై మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో సంబంధిత పాఠశాలలో పరిస్థితిని పరిశీలించగా, ఉపాధ్యాయుడు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం
పోలీసుల సమక్షంలో డ్రింకింగ్ టెస్ట్
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడికి డ్రింకింగ్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో 196 విలువ నమోదైనట్లు సమాచారం. అయితే పరీక్షకు సంబంధించిన అధికారిక నివేదిక, పోలీసుల ధ్రువీకరణ వెలువడాల్సి ఉంది.
రెండేళ్లుగా ఆరోపణలు?
సదరు ఉపాధ్యాయుడు గత రెండేళ్లుగా మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై గతంలో పలుమార్లు మందలించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
విద్యార్థులపై ప్రభావంపై ఆందోళన
ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్లు నిర్ధారణ అయితే విద్యార్థుల విద్యాభ్యాసం, పాఠశాల క్రమశిక్షణపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఎంఈఓ వివరణ
ఈ ఘటనపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బాలు నాయక్ను ఫోన్లో వివరణ కోరగా, సంబంధిత ఉపాధ్యాయుడికి షోకాజ్ మెమో జారీ చేసి, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు


