సిద్దిపేట జిల్లా, గజ్వేల్, ఆగస్టు 4 ,శుభోదయ డైనమిక్
వార్త
హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు అవివేకపూరితమైనవని గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించే నాయకుడిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కట్టడి చేయాలని భావించడం కాంగ్రెస్ నాయకుల మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు.
గుడికి వెళ్లడం రాజ్యాంగ హక్కు
గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని మాదాసు శ్రీనివాస్ పేర్కొన్నారు. తమ విశ్వాసానికి అనుగుణంగా హరీశ్ రావు దేవాలయానికి వెళ్లడాన్ని రాజకీయ వివాదంగా మార్చి, క్షుద్రపూజలు చేశారంటూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. ఇటువంటి నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని చెప్పారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త వివాదాలు
ముఖ్యమంత్రి ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించడంతో, ఆ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే క్షుద్రపూజల వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ అంశం వచ్చినా దాని నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హరీశ్ రావుపై అసత్య ఆరోపణలు చేసిన వారికి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపినప్పటికీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదే విషయాన్ని మళ్లీ ప్రస్తావించడం సరికాదన్నారు.
హామీల అమలుపై దృష్టి పెట్టాలి
అధికార పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని మాదాసు శ్రీనివాస్ హితవు పలికారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు అనాగరిక వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. హరీశ్ రావును ఎంత లక్ష్యంగా చేసుకున్నా ప్రజల పక్షాన ఆయన పోరాటం కొనసాగుతుందని, ఇలాంటి రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.
