నల్లగొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 3
డయల్-100 సమాచారం అందగానే ఐదు నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
చండూరు పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ విధి నిర్వహణలో అప్రమత్తత, సమయస్ఫూర్తి ప్రదర్శించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఉడతలపల్లి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోందని డయల్-100కు సమాచారం అందడంతో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ వెంటనే స్పందించి కేవలం ఐదు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మెయిన్ డోర్ పగులగొట్టి లోపలికి వెళ్లి సీపీఆర్ అందించిన హెడ్ కానిస్టేబుల్
ఘటన స్థలానికి చేరుకున్న అనంతరం పరిశీలించగా, ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంటనే ఇంటి ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించి, ఉరిని తొలగించారు. అనంతరం బాధితుడికి తక్షణ ప్రాథమిక చికిత్స (సీపీఆర్) అందించి, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో అతని ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారు.
సమయస్ఫూర్తిపై ప్రశంసలు.. ప్రజల ప్రాణరక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధమే
హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ చూపిన ధైర్యసాహసాలు, అప్రమత్తత, సమయానుకూల స్పందనపై స్థానిక ప్రజలతో పాటు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-100కు వచ్చిన సమాచారంపై పోలీసులు వేగంగా స్పందిస్తూ ప్రజల ప్రాణరక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.
