మేడ్చల్–మల్కాజిగిరి, ఆగస్టు 4 ,శుభోదయ డైనమిక్ వార్త
బాలానగర్ టీ-జంక్షన్ వద్ద సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో 28–30 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
చెరకు రసం దుకాణం వద్ద విద్యుత్ లీకేజీ ఘటనకు కారణమని ప్రాథమిక నిర్ధారణ
ప్రాథమిక విచారణలో శ్రీ మల్లికార్జున చెరకు రసం దుకాణం సమీపంలో విద్యుత్ లీకేజీ కారణంగా బాధితుడు విద్యుదాఘాతానికి గురైనట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చెరకు రసం దుకాణానికి ఉన్న విద్యుత్ కనెక్షన్ నుంచి విద్యుత్ లీకేజీ ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.
మృతుడి గుర్తింపునకు ప్రజల సహకారం కోరిన బాలానగర్ పోలీసులు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, గుర్తింపును తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మృతుడిని గుర్తించడంలో ప్రజలు సహకరించాలని కోరిన బాలానగర్ పోలీసులు, సంబంధిత సమాచారం తెలిసిన వారు సమీపంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
