డైనమిక్ న్యూస్, నేరెడ్చర్ల , ఫిబ్రవరి 10
నేరెడ్చర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ నల్లగొండ విభాగం మరియు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఆకస్మిక తనిఖీలకు దిగిన అధికారులు
ఈ తనిఖీలను విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ నల్లగొండ విభాగం సీఐ దశరథ, సివిల్ సప్లైస్ శాఖ రివెన్యూ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కలిసి నిర్వహించారు.
రేషన్ షాపులో నిల్వల తనిఖీ
చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ షాప్ నెం. 4015004 వద్ద రేషన్ డీలర్రవి గుప్తా (తండ్రి: లక్ష్మీ నర్సయ్య) వద్ద ఉన్న బియ్యం నిల్వలను అధికారులు పరిశీలించారు.
బియ్యం నిల్వల్లో భారీ తేడా
పుస్తకాల ప్రకారం షాపులో 46.96 క్వింటాళ్ల బియ్యం ఉండాల్సి ఉండగా,భౌతికంగా 36.67 క్వింటాళ్ల బియ్యం మాత్రమే లభించాయి.దీంతో 10.29 క్వింటాళ్ల బియ్యం తేడా (వేరియేషన్) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు
ఈ అవకతవకలపై ఈసీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 6A కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇతర గ్రామాల్లోనూ తనిఖీలు
అదేవిధంగా సోమారం మరియు బొడలదిన్న గ్రామాల్లోని రేషన్ దుకాణాలను కూడా విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు.
అక్రమాలకు తావులేదని హెచ్చరిక
రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు సహించబోమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
