సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 31 (డైనమిక్ న్యూస్):
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ , జిల్లా ఎస్పీ నరసింహ జెండా ఊపి రన్ను ప్రారంభించారు.ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ చౌరస్తా నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు సుమారు వెయ్యి మందికి పైగా పౌరులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యత, పౌరుల ఐకమత్యం, జాతీయ సమగ్రతను ప్రతిబింబించే నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.
దేశ ఐక్యతకు సర్దార్ పటేల్ సేవలు విశిష్టం – కలెక్టర్ నందలాల్ పవార్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ మాట్లాడుతూ “భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్ర అనంతరం దేశంలోని 560 సంస్థానాలను ఏకీకృతం చేసి భారతదేశ ఐక్యతను సాధించారు. ఆయన కృషి ఫలితంగానే మన దేశం ఒక దృఢమైన సమగ్ర రాజ్యంగా నిలిచింది” అని పేర్కొన్నారు.యువత దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో ముందుండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి మహనీయుల ఆశయాలను అనుసరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అమరవీరులకు స్మరణగా రన్ ఫర్ యూనిటీ – ఎస్పీ నరసింహ
జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ “పోలీసు అమరవీరుల వారోత్సవాలు మరియు జాతీయ ఐక్యత దినోత్సవం ముగింపు సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత పాల్గొనడం హర్షణీయమని” తెలిపారు.స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యత సాధనలో సర్దార్ పటేల్ గారి సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను సాకారం చేయడంలో ప్రతి పౌరుడూ భాగస్వామ్యులు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు



ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఆర్టీఏ అధికారి జయప్రకాష్ రెడ్డి, జిల్లా ఫైర్ అధికారి కృష్ణా రెడ్డి, ఎంఆర్ఓ కృష్ణ, టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, జైల్ సూపరింటెండెంట్ సుధాకర్, ఎక్సైజ్ అధికారి మల్లయ్య, ఫైర్ స్టేషన్ ఎస్ఐ జానయ్య, టౌన్ ఎస్ఐలు సాయిరాం, మహేందర్ నాథ్, శివతేజ, ఆర్ఎస్ఐలు సురేష్, అశోక్, రాజశేఖర్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.
