డైనమిక్ న్యూస్ ప్రతినిధి, నల్గొండ, అక్టోబర్ 30:
రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో విద్యా సంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. పట్టణంలోని డిగ్రీ, ఇంటర్ కళాశాలలు మూతపడ్డాయి.
విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆందోళన
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కోరే రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు నిలిపివేయడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేట్ కళాశాలల నిర్లక్ష్యం
కొరే రమేష్ మాట్లాడుతూ, ప్రైవేట్ కళాశాలల్లో చదువు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అదనపు రుసుములు వసూలు చేయడం వంటి అక్రమాలను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని కోరారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
స్పందించకపోతే ఉద్యమాలు
ప్రభుత్వం విద్యారంగ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరింత తీవ్ర ఉద్యమాలకు దిగుతామని కోరే రమేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సాగర్ డివిజన్ నాయకులు వర్షిత్, శివ, అరవింద్, నాగరాజు, ప్రవీణ్, అరుణ్, చంటి తదితరులు పాల్గొన్నారు.
