సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్,26 నవంబర్
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న సూర్యాపేట డివిజన్కు చెందిన ఆర్వోలు, స్టేజ్-వన్ ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదటి విడతలో 8 మండలాలు – 159 గ్రామపంచాయతీలు
మొదటి విడతలో జిల్లాలోని 8 మండలాల్లో కలిపి 159 గ్రామపంచాయతీలు, 1,442 వార్డులకు సంబంధించి 44 నామినేషన్ కేంద్రాల ద్వారా నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ బాధ్యతను అధికారులు అత్యంత సీరియస్గా తీసుకొని, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
ఎన్నికల నియమాలు తప్పనిసరి
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ సమయంలో పాటించాల్సిన అన్ని నియమ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమయపాలన పాటించడంతో పాటు, నామినేషన్ కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
నామినేషన్ ఫారాలు సిద్ధంగా ఉంచాలి
నామినేషన్ కేంద్రాల్లో అవసరమైనన్ని ఫారాలు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, నామినేషన్ ప్రక్రియలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎలక్షన్ కోడ్ కచ్చితంగా అమలు
ఎంపీడీవోలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.
సమావేశానికి హాజరైన అధికారులు
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామ రావు, డీపీఓ యాదగిరి, డీఆర్డీఏ పీడీ వి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
