డైనమిక్ ,కారంపూడి, అక్టోబర్ 30
మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకుంటుందని కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, మండల వ్యవసాయ అధికారి పోట్లు నరసింహారావు తెలిపారు. గురువారం వారు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వర్షాల వల్ల దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు.
రైతులకు సూచనలు
పొలాల్లో నిల్వ నీటిని వెంటనే తొలగించాలని రైతులను అధికారులు సూచించారు. వరి కంకుల్లో మొలకలు వస్తే 50 గ్రాముల ఉప్పును ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని మండల వ్యవసాయ అధికారి సూచించారు. అలాగే పడిపోయిన వరి దుబ్బులను కర్రల సాయంతో లేదా తాడుల సాయంతో పైకి నిలబెట్టాలని సూచించారు.
రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోండి
రైతులు వ్యవసాయ సమస్యల పరిష్కారానికి తమ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచించారు. తుఫాన్ ప్రభావిత రైతుల పక్కన ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
