నల్లగొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 16
నల్గొండలో పత్తి కొనుగోళ్ల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు జిన్నింగ్ మిల్లుల యజమానులతో జరిగిన ఈ సమావేశంలో పత్తి కొనుగోలు వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించే దిశగా చర్చించారు.
సమ్మె ఉపసంహరణ కోరిన కలెక్టర్
పత్తి రైతులు ఇబ్బందులు పడకూడని దృష్ట్యా సోమవారం నుండి యాజమాన్యం చేపట్టాలని భావించిన సమ్మెను విరమించుకోవాలని కలెక్టర్ జిన్నింగ్ మిల్లుల యజమానులను కోరారు.మిల్లుల యజమానులు ప్రస్తావించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ–సహకార శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్తో ఫోన్లో మాట్లాడి సమస్యలను వివరించారు.
జిల్లాలో 23 జిన్నింగ్ మిల్లులలో 19 ప్రారంభం
జిల్లాలోని 23 జిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటివరకు 19 మిల్లులు ప్రారంభించాయని, మిగిలిన నాలుగు మిల్లులను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రైతుల ప్రయోజనాల దృష్ట్యా మిల్లులు ఎలాంటి సమ్మెలకు వెళ్లకుండా కొనుగోళ్లు కొనసాగించాలని ఆమె సూచించారు. రాష్ట్ర అసోసియేషన్తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మిల్లుల యజమానులు తెలిపారు.
పత్తి అమ్మకాలకు క్వింటాళ్ల పరిమితి సడలింపు
ప్రస్తుతం రైతులు కేవలం 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే అమ్ముకునేందుకు వీలుండగా, ప్రభుత్వం ఆ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచిందని కలెక్టర్ తెలిపారు.అయితే అదనపు పరిమితిని ఉపయోగించుకోవాలంటే వ్యవసాయ విస్తరణ అధికారి లేదా వ్యవసాయ అధికారి నుంచి ధృవీకరణ పత్రం తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని సూచించారు.ఈ ఓల సాఫ్ట్వేర్లో కూడా 12 క్వింటాళ్ల అమ్మకానికి సౌకర్యం కల్పించిన విషయాన్ని రైతులకు విస్తృతంగా తెలియజేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.
నాణ్యమైన పత్తి తీసుకురావాలని సూచన
రైతులు నాణ్యమైన పత్తిని జిన్నింగ్ మిల్లులకు తెచ్చి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని కలెక్టర్ అభిలషించారు.
సమావేశానికి హాజరైన వారు
మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
