నేరేడుచర్ల, జూన్ 12,శుభోదయ డైనమిక్ వార్త
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
ఈ సందర్భంగా నేరేడుచర్ల ఎస్సై సైదిరెడ్డి మాట్లాడుతూ సమాజం నుంచి డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మాదకద్రవ్యాల బారిన పడుతున్న యువత ఆరోగ్యాన్ని కోల్పోవడంతో పాటు తమ బంగారు భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
పోలీసులకు సమాచారం అందించాలి
డ్రగ్స్ విక్రయం, వినియోగం లేదా రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.
నిరంతర తనిఖీలు – కఠిన నిఘా
డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారని ఎస్సై తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వలు, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ
కార్యక్రమం అనంతరం స్థానిక ప్రజలతో డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
