తిరుపతి , డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28
ముంతా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండడంతో దేవతా నగరం చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. వర్షాల వలన శేషాచల కొండలు పచ్చని ఆవరణతో సరికొత్త అందాలను సంతరించుకున్నాయి.
జలపాతాల హోరులో శేషాచలం
ఎత్తైన కొండలపై నుండి పాలనురుగులా దూకుతున్న జలపాతాలు భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం జలపాతం కనువిందు చేస్తోంది. అలాగే మోకాళ్ళ మెట్టు సమీపంలోని అక్కగార్ల గుడి వద్ద ఎత్తైన బండరాళ్లపై నుండి జాలువారుతున్న జలధారలు అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి.
పొంగి ప్రవహిస్తున్న సెలయేర్లు
భారీ వర్షాల కారణంగా కొండల మధ్యుగా ప్రవహించే సెలయేర్లు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఎత్తైన ప్రదేశాల్లోని నీరు ఘాట్ రోడ్లకు చేరుకోవడంతో కొన్నిచోట్ల వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
అప్రమత్తంగా ఉండాలన్న టిటిడి హెచ్చరిక
కొండ ప్రాంతాల్లో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, టిటిడి అధికారులు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపారు. భక్తులు తిరుమల ఘాట్ రోడ్లలో ప్రయాణించే సమయంలో వేగం నియంత్రణలో ఉంచి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు
