నల్గొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త,మే 30
పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా ప్రజల సంక్షేమానికి సహకరించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. శనివారం వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ నల్లగొండ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో నీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.ఈ సందర్భంగా వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ తరఫున హెచ్ఆర్ హెడ్ మోహన్, ప్లాంట్ హెడ్ కొడాలి అచ్యుత, భాస్కర్ రావు, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ సతీష్ కలిసి CSR చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి జిల్లా అభివృద్ధికి తమవంతు సహకారం అందించాలని కోరారు. వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్ చేసిన ఈ సేవ ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్కుమార్, జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
